SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Tuesday, July 11, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-12

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

12



చంచల్  ఎన్నో విషయాలడుగలనుకున్నాడు, కానీ ఆ సమయంలో అతనికి ఏవీ గుర్తుకు రాలేదు. జాలి నిండిన స్వరంతో చంచల్ గురువుగారిని ఇలా అడిగాడు.

చంచల్: గురువు గారు, నా సాధన ఫలిస్తుందటారా ?

గురూజీ: ఎందుకు ఫలించదూ?  నేను ఇంతకుముందే చెప్పాను. అమ్మ తన పిల్లలను ఎన్నడూ వదలదు. అంతేకాక నువ్వు సరియైన దారిలోనే నడుస్తున్నావు. నీకు సాధన గూర్చి తెలుసుకోవాలనే తపన ఉంది. ఇతరులకు ఇలా ఓపికతో తెలుకోవాలనే పట్టుదల ఉండకపోవచ్చు. కొందరు సాధనా మార్గంలో కలిగే అవాంతరాలను చూసి సాధననే మానేస్తారు. అసలు వాటి వెనక ఉన్న మర్మాన్ని తెలుకోవడానికి ప్రయత్నమే చేయరు. సాధనా మార్గాన్ని తప్పించుకోవటానికి అంతర్గతంగా అవకాశం కోసం వేచి చూస్తారు. ఇదో ఆట, బుద్ధికీ మనస్సుకీ మద్య జరిగే ఆట.

చంచల్: గురుగారు, సంస్కార శుద్ధి ఎలా సాధించవచ్చు?

గురూజీ: సంస్కార శుద్ధి అంత తేలికైన విషయం కాదు. అలాగని అసాధ్యం అంతకన్నా కాదు. అందుకు నిశ్చలమైన నిరంతర దీక్షతో కూడిన ప్రయత్నం కావాలి.

చంచల్: గురువుగారు, లోకంలో ఎన్నో రకాల దీక్షలున్నాయి కదా? వీటిలో ఏది మంచిది?


గురూజీ: అన్ని దీక్షలూ మంచివే. అన్ని దీక్షల సారం అహం బ్రహ్మాస్మీ గా తెలుసుకోవడం. అందుకు శ్రీవిద్య దీక్ష చాలా శక్తి వంతమైనది. శ్రీవిద్య సంస్కార శుద్ధి పొందడానికి చాలా మంచి మార్గం.

చంచల్:  నేను శ్రీవిద్య దీక్షకు అర్హుడినా? గురువు గారు

గురూజీ: తప్పకుండ. నేను నీకు దీక్ష ఇవ్వడానికి సమయం నిర్ణయించాను. నీకు వీలైతే వచ్చే ఆదివారం రా.

చంచల్ కు చాలా ఆనందం కలిగింది. వెంటనే తన మనస్సులో అయితే నేను జనవశీకరణ విద్యను నేర్చకోవచ్చు అనుకుని మరు వెంటనే ఇలా అడిగాడు...

చంచల్: గురుగారు, దీక్ష తీసుకోవటానికి నేనేమి చేయవలసి వుంటుంది? దీక్ష తీసుకున్న తరువాత ఎమైనా నియమాలు పాటించ వలసి ఉంటుందా?

గురూజీ: నీవు దీక్ష తీసుకోవటానికి ప్రోద్దున్నే రావలసి ఉంటుంది. ఏ దీక్షకూడా అపరాహ్నంలో ఇవ్వబడదు. అందుకే మధ్యహ్నం కన్నా ముందే జరగాలి. అలా కాకుంటే సాయంసంధ్యా కాలంలో ఇవ్వాలి. అందుకు మనం ఇద్దరంకూడా  దీక్ష ప్రధానం అయ్యే వరకు ఉపవాసం ఉండాలి. కాబట్టి ఉదయమే జరిగితే బాగుంటుంది. ఆరోజు నీవు తల స్నానం చేయాలి. అయినా నీవు రోజూ చేస్తున్నావనుకుంటా.

ఇది ఆడవారి విషయంలో ఉండదు. మద్య, మాంసాదులు తీసుకోరాదు. ఈ అలవాట్లు వుంటే అవి వదిలి పెట్టాలి. బాహ్య మరియు అంతః శుద్ధిని పాటించాలి. బహిస్టు సమయాలలో భార్యా సంగంమం చేయరాదు. ఆరోజులలో వారిచే వండిన ఆహారం తీసుకోరాదు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఆ రోజులలో వారు గృహ సంబంద విషయాలనుండి దూరంగా ఉండాలి. వారిని ముట్టుకోరాదు. ప్రతిరోజూ గురువులిచ్చిన అన్ని మంత్రాలూ సాధనచేయాలి. మంత్ర సాధన ఏరోజూ తప్పకూడదు. ఏ కారణంగానైనా శ్మశానాని వెళ్ళిన రోజు కూడా వదలకుండా చేయాల్సిందే. ఇవి కొన్ని తప్పక పాటించవలసిన నియమాలు. ఈ నియమాలు ఒక గురుపరనుండి మరో పరంపరకు వేరు వేరుగా ఉంటాయి.
నియమాలను గురించి విన్న చంచల్ కొంత ఇబ్బందిగా అనిపించింది. మూడు రోజులు కూడా తన భార్యకు దూరంగా ఉండడం కష్టంగా భావించాడు. కానీ దీన్ని ఓ చాలెంజ్ గా భావించి ఎదుర్కోవాలని నిర్ణయించుకుని ఇలా అడిగాడు...

చంచల్: గురుగారు, దీక్ష ఎలా ఇవ్వబడుతుంది?

గురూజీ: దీక్ష మూడు పద్ధతులలో ఇవ్వబడుతుంది 1) స్పర్శ దీక్ష 2) వీక్షణ దీక్ష  మరియు 3)ధ్యాన దీక్ష.

1) స్పర్శ దీక్ష ఈ పద్ధతిలో గురువులు తమ హస్తం శిశ్యుడి తలపై నుంచి మంత్రాలు ఇస్తారు. తలపై అనగా సహస్రారం చక్రం

2) వీక్షణ దీక్షా పద్ధతిలో గురువు, శిశ్యుడి షట్ చక్రాలను తన చూపులతో స్పశిస్తూ మంత్రం ఇస్తారు. కొన్ని చోట్ల పై రెండు పద్ధతులు ఏక కాలంలో ఉపయోగిస్తారు.

3) ఇక ధ్యాన దీక్షా పద్ధతిని మౌన దీక్ష అని కూడా అంటారు. ఇందు గురువులు ఏవిధమైన మాటలు, చేతలను ఉపయోగించకుండానే దీక్ష ఇస్తారు. శ్రీదక్షిణామూర్తి మాదిరిగ, శిశ్యుడు దగ్గరగా వున్నా దూరంగా వున్నా ఈ పద్ధతి ఉపయోగించవచ్చు. ఈ పద్దతి చాలా మహిమ కలది కానీ గురువు శ్రీదక్షిణామూర్తి స్వరూపుడై వుండాలి.

ఇది చాలా గొప్ప దీక్ష విధానం, కానీ. ఈ రోజుల్లో ఈ పద్ధతిని చాలా మంది ఇంటర్నెట్ ద్వారా తమ సౌకర్యం కొరకు ఉపయోగించు కుంటున్నారు. కానీ ఈ రోజుల్లో శ్రీదక్షిణామూర్తి లాంటి గురువులెందరున్నారు?
అలాంటి వారున్నా వారు బయట ప్రపంచంలోకి రాకపోవచ్చు. మనం వారిని గుర్తించలేము కూడా. ఈ రోజుల్లో అందరికీ క్షణాల్లో చాలా సులభమైన దీక్ష కావాలి. వెంటనే తమ భౌతిక కోరికలన్నీ నెరవేరాలి. నిజమైన నిజం ( ఆత్మ జ్ఞానం) గూర్చి ఎవరూ చింతించరు. ఇంకా హస్యాస్పందమేంటంటే కొందరు పోస్టల్ దీక్షకూడా ఇస్తారట. అందు వారిచ్చే సమాచారం ఏమిటో అవి అసలు ఏ విధంగా ఉపయోగపడుతాయో ఎవ్వరికీ అక్కరలేదు. ఎందుకంటే ఇవన్ని కూడా అనారోగ్యకరమైన, ప్రాణరహిత పద్ధతులు. ప్రాణంలేని మంత్రాలు ఫలిస్తాయా? ఇలాంటి పద్ధతుల్లో పయనించి నిరుత్సాహం నిర్వేదంలో మునిగి కొత్త గురువులను కొత్త పద్ధతులను అనుసరించటాకి సమయాత్తమౌతారు.


చంచల్: గురువు గారు, పై సశాస్త్రీయ పద్ధతులు పాటిస్తే ఏం జరుగుతుంది? అది శిశ్యుడికి ఏవిధంగా ఉపయోగపడుతుంది.

చాలా మంచి ప్రశ్న అని గురువు గారు ఇలా చెప్పడం ప్రారంభించారు.....

ఒక నిజమైన గురువు ఆధ్యాత్మిక శక్తికి కేంద్రం. అతని రక్తం, ప్రతి కణంలో ఆ శక్తి నిండి ఉంటుంది. అలా తను సాధించిన ఆ శక్తిని అతను తన శిష్యునికి ప్రసరింపజేస్తాడు. దీన్నే శక్తిపాతం అంటారు.
ఎవరైతే ఈ శక్తిపాతం ద్వారా ఆ శక్తిని పొందుతారో వారే ఈ ఆధ్యాత్మిక సాధనా ప్రయాణం సాగించగలరు. ఇతరులు దీన్ని  కొనసాగించలేరు. ఈ రోజుల్లో ఇలాంటి వారే ఎక్కువగా కనిపిస్తారు.
శక్తిపాతంలేని ఆధ్యాత్మిక ప్రయాణం ప్రయోజనం లేనిది. అది శుద్ధ దండగ. మనం మన గురువుల త్యాగాన్ని గుర్తించాలి. తను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపదను మన కోసం ధారపోస్తారు.
ఈ ఆధ్యాత్మిక సంపద వారు ఎంతో కష్టపడి ఎంతో తపస్సు చేసి సాధించినది. అలాంటి శక్తిని తన శరణు కోరినవారి అభ్యున్నతికి ధారపోస్తారు. దానిని భౌతిక సంపదలతో వెలకట్టలేము. అది ఈ ప్రకృతిలో ఎంతో పవిత్రమైనది. మరి దేనితోను దాన్ని పోల్చలేం. తన శిష్యుల కోసం తన సంపాదిన శక్తి ధారపోయడం ఎంతటి త్యాగం.  
అసలు అంతటి పవిత్రమైన విలువైన శక్తి వారు మనకోసం ఎందుకివ్వాలి? మళ్ళీ ఆ కోల్పోయిన శక్తిని పొందడానికి ఎంత శ్రమ పడాలి? అందుకు బదులుగా వారు మన నుండి ఏమీ ఆశించరు. మన అభ్యున్నతి తప్ప. అదీ నిస్వార్ధమైన ప్రేమంటే. అమ్మతనపు కమ్మతనంలోని పరిపూర్ణ ప్రేమ. అందుకే అమ్మకు గురువులకు అభేదం.
గురువు మనకు తల్లిదండ్రుల తరువాత ప్రత్యక్ష దైవం. అందుకే గురువు చాలా ముఖ్యమైన వారు. అందుకే మన వేదాలలో, తైత్తిరీయ ఉపనిషద్ లో మాతృదేవో భవః, పితృదేవో భవః, ఆచార్యదేవో భవః మరియు అథిదిదేవో భవః అని తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుకు ఇచ్చాయి.
తల్లిదండ్రులు మనకు శరీరాన్నిచ్చి, భుక్తివిద్యలను నేర్పితే, గురువు మనకు పరావిద్యను నేర్పుతారు. గురువు కు ప్రత్యామ్నాయం లేదు, ఉండదు, ఉండబోదు.
ఎవరైతే వారిని సరిగా అర్థంచేసుకుంటారో, వారి త్యాగాన్ని గుర్తెరిగి నడుచుకుంటారో వారు వారి గురువులను ఎప్పుడూ అశ్రద్ధచేయరు. వారు చూపిన మార్గాన్ని తూ.చ తప్పక పాటించి సార్థకత పొందుతారు. అలాంటి వారి గూర్చి చిన్న చిన్న విషయాలలో కూడా మన డబ్బు, సమయాన్ని వెచ్చించడానికి వెనుకడుగేస్తాం. కనీసం కొన్ని పర్వదినాలలో వారితో మాట్లాడ్డానికి కూడా మనకు టైం ఉండదు. పైగా ఏవో కొన్ని సంక్షిప్త మెస్సేజ్ లు ఇచ్చి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఎంతో గొప్పగా ఫీల్ అయిపోతాం.
గురువుల నుండి వారి ఇష్టాననుసరించి (కర్మననుసరించి?) పరావిద్యను మరియు అపరా విద్యనూ పొందుతారు. అపరా విద్య పొందినవారు విద్యార్థులు పరా విద్యను పొందినవారు శిష్యులు.
ఎవరైతే గురువాక్యపాలన మనసా వాచా కర్మణా చేస్తారో వారే నిజమైన శిష్యులుగా పరిగణించబడతారు. ఇదే విద్యార్థికీ, శిష్యునికీ వున్న వ్యత్యాసం.
నీకు గుర్తుందా? ఒకసారి నువ్వు నన్నడిగావు. విద్యార్ధికి, శిష్యునికి తేడా ఏంటని. ఇప్పుడు అర్ధమైందా? విద్యార్ధిగా ఉంటావో లేక శిష్యునిగా మారుతావో అది నీచేతులలోనే ఉంది.
నాకు నా జీవితంలో ఎక్కువ మంది విద్యార్థులు చాలా తక్కువ మంది శిష్యులు. శిష్యులను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. హాస్యాస్పదం ఏమిటంటే, ఈ రోజుల్లో ఆర్భాట గురువు చాలా ఎక్కువ. శిష్యులమని చెప్పుకొనే వారు వారి విషయవాసనలకోసం, భౌతికకోరికల కోసం ఆ ఆర్భాట గురువుల చుట్టూ తిరుగుతూ అదో వ్యాపారంగా మార్చి , గురుశిష్య బంధాన్ని అపహస్యంచేస్తున్నారు.

చంచల్ మనస్సులో నేను తప్పక గురువు గారి శిష్యుడిగా ఉంటాను అనుకొని ఎంతో ఆనందాతిశయంతోనిండిన మనస్సుతో మాట రాక ఉండిపోయాడు.

కొంచెం సేపటి తర్వాత, గురువు గారు మీ అనుజ్ఞ అయితే నేను ఆదివారం వస్తాను అని వారి పాదాలకు నమస్కరించాడు.

ఆ రోజు వారి  ఉద్యోగసహచరులతో ముక్తసరిగా ఉండి తొందరగా పని ముగించుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో తను చేయబోయే సాధన గూర్చి తన భార్య ఆకర్షకు వివరించాడు. తన కూతురు మోహా కూడా వారి మాటలు వింటూ కూర్చుంది. ఆ చిన్న పాపకు అవి ఏమీ అర్థంకాక వెంటనే వారి నాన్న గారితో...

మోహా: నాన్న, శ్రీవిద్య అంటే ఏమిటి?

తన కూతురడిగిన ఆ ప్రశ్నకు చంచల్ నిర్ఘాంత పోయి తడపడ్డాడు. ఎందుకంటే అతనికీ శ్రీవిద్య యొక్క నిజమైన అర్థం తెలియదు. అప్పుడాలోచించాడు అసలు శ్రీవిద్య అంటే ఏమిటి”? తేరుకోని,  సరే చిట్టితల్లీ ఇప్పటికే టైం 9 అయింది. నీవు నిద్రపోవాలి. ఈ విషయాలన్నీ నీకు తర్వాత చేప్తాను. తర్వాత ఇదే ప్రశ్న తన భర్య ఆకర్ష అడిగింది. ఆమెతో కూడా ఆ విషయాలన్నీ తరువాత మాట్లాడదామని దాటవేసాడు. కానీ అతని మనస్సు మాత్రం అసలు శ్రీవిద్య అంటే ఏమిటి”? అని ఆలోచిస్తూ అన్యమనస్కంగానే గడిపి నిద్రలోకి జారుకున్నాడు.

ఇంకావుంది...............

 

No comments:

Post a Comment