SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Wednesday, June 21, 2017

శ్రీవిద్యా ప్రస్థానం - 10

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

10


గు రు సిద్ధులు  : శ్రీవిద్యా సాధన గూర్చి తెలుసుకోడానికి ఇంకా సమయం వుంది. ప్రస్తుతం సంధ్యావందనం బాగా సాధన చేయి.

చంచల్ ఒక్కసారి గా కొంత నిరుత్సాహపడి కాసేపట్లో తేరుకుని ఈ విధంగా అడిగాడు
చంచల్ : గురువు గారు నేను ప్రతిరోజూ ఇక్కడకు రావాలా?
గురు సిద్ధులు : అవసరం లేదు. నీకు వీలునప్పుడు రావచ్చు. ఈ రోజుల్లో ప్రజల జీవన పరిస్థితులు నాకు తెలుసు. మొదట నీవు నీ ఉద్యోగానికి ప్రాధాన్యత ఇవ్వు. భగవంతున్ని(అమ్మవారిని) ప్రతిచోట చూడాలి. అందుకే వృత్తి రూపేణ సంస్థితా... అంటారు. అంతే ప్రాధాన్య సాధనకూ ఇవ్వాలి. ప్రతి మనిషికీ 24గంటలే. కావలసినవన్నీ సాధించటానికి ఈ సమయం సరిపోతుంది. ప్రతి క్షణాన్ని చాలా విలువైనదిగా భావించి చాలా తెలివిగా పరిణతి చెందిన వ్యక్తిత్వంతో ఉపయోగించుకోవాలి. సమయం సద్వినియోగించుకునే పద్ధతిని అలవాటుచేసుకోవాలి.
చంచల్ గురువుగారికి కృతజ్ఞతలు తెలిపి వారి ఆశీస్సులు తీసుకుని ఉత్సాహం నిండిన మనస్సుతో బయలుదేరాడు. దారిలో రేపటినుండి ఖచ్చితంగా సంధ్యావందనం చేయాలి. ఇంకా తన రోజూవారి కార్యక్రమాలను గూర్చి ప్రణాళిక ఆలోచించుకుంటూ ముందుకు నడిచాడు. ఆ రోజున రాత్రి 8గంటలకే చంచల్ ఇల్లుచేరుకున్నాడు. చంచల్ అంత త్వరగా ఇంటికి రావడం తన భార్య అకర్ష, కూతురు మోహా కు ఒకింత ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. చంచల్ కూతురు మోహా ఆనందంతో  తన చన్నారి చేతులతో చంచల్ కాళ్ళని చుట్టేసుకుని ఇలా అడిగింది....
మోహా: నాన్న ఈ రోజు ఇంత త్వరగా వాచ్చారేంటి?
చంచల్ : నీకోసమే ... తల్లీ
మోహా: అయితే ఈ రోజూ మీరు నాకు కథ చెప్పాలి. లేకుంటే నేను నిద్రపోను. నీవేప్పుడూ నాకు కథ చెప్పలేదు.
చంచల్ : తప్పకుండా బంగారం. నీకు కథ చెప్తాను.
చంచల్ కి తన కూతురు కళ్ళలో ఆనందం కనిపించింది. చంచల్ ఫ్రెష్  అయిన తరువాత మోహాను ఒడిలో కూర్చోపెట్టుకుని కథ చెప్పాడు. పాప కథవింటూ వింటూ అలాగే నిద్రలోకి జారుకుంది. నిద్రపోతున్న తన కూతురి మోహంలోకి చూసిన చంచల్ కి చెప్పలేని ఆనందం , సంతృప్తి కలిగాయి. మోహాను పక్కపై పడుకోపెడుతుంటే అకర్ష అడిగింది....
ఆకర్ష : ఎమిటీ విషయం? ఈ రోజు ఇంత త్వరగా ఇల్లు చేరటం ఆశ్చర్యంగా ఉంది.
చంచల్ : నీకోసమే...
ఆకర్ష : ఆహహ... కథలు చెప్పకండి. నేను మోహాను కాదు.
చంచల్ :  కథ కాదు... నిజం
అలా మాట్లాడుకుంటూ భోజనం చేసి, టి.వి జోలికి పోకుండా అలా... ఇద్దరూ కబుర్లు చెబుకుంటూ 10.30 కి నిద్రలోకి జారుకున్నారు. చంచల్ పోద్దున్నే 4.30 కి నిద్రలేవడం గూర్చి మరిచి పోకుండా అలారం పెట్టుకున్నాడు.
ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, 5.30గంటలకు గురువు గారిచ్చిన విధిపూర్వకంగా సంధ్యావందనాన్ని ప్రారంభించాడు. క్రియా భాగం కొత్తకావడంతో కొంత జాగ్రత్తతో ముగించి గాయత్రి మంత్ర జపం ప్రారంభించాడు.
చంచల్ మంత్ర జపానికి కళ్ళు మూసుకొని మంత్ర జపం ప్రారంభించాడు.  తన నోరు మంత్ర జపంచేస్తోంది. మనస్సు మాత్రం తన ఆఫీసు విషయాలపైకి కాసేపు, మోహా, ఆకర్షని గూర్చి తరువాత తనకి నచ్చిన హీరో,హీరోయిన్ వైపు... అలా అలా చాలా విషయాలపై పరిభ్రమిచండం మొదలు పెట్టింది. అదే సమయంలో జపసంఖ్యను కూడా... చివరికి 108 సంఖ్య ముగియడంతో కళ్ళుతెరిచాడు.
చంచల్ కి చాలా సంతోషం కలిగింది. ఒక గొప్పకార్యాన్ని సాధించినట్టుగా కొంచెం సేపు గొప్పగా  తన గురించి ఊహించుకున్నాడు. ఈ విధంగా రెండునెలలు గడిచాయి. సంధ్యావందన క్రియ భాగం గురువుగారిచ్చిన ప్రతులను చూడకుండానే చేయడం వచ్చేసింది. కాని తను మాత్రం వివిధమైన భౌతిక విషయవాసనలతో నిండిన మనస్సుతో సంధ్యావందనం చేస్తున్నాడు. ఇంతకు ముందు కంటే తక్కువ సమయంలో సంధ్య పూర్తిచేసే విధంగా అలవాటైంది. కానీ మనస్సు మాత్రం ఎప్పటి మాదిరిగానే వివిధ విషయాలపైకి తిరిగేది. కానీ ఈ విషయం తనెప్పుడూ పట్టించుకునే వాడు కాదు. ఇంకా కొన్ని రోజుల తరువాత అతని నోరు, మనస్సు వాటి పని అవి చేసుకొని పోయేవి. కాని అతడు ఆ తేడాను మాత్రం గమనించలేకపోయాడు.
అమ్మ తన పిల్లన్నేప్పుడు గమనిస్తూనే ఉంటుంది. వారి ఎదుగుదలకు సరైన మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడూ వాటిని జాగ్రత్తగా గమనించి మనను మనమే సంస్కరించుకోవాలి.
ఒక రోజు చంచల్ జపం చేస్తుంటే జప స్ఫురణ కోల్పోయి, తను ఆకర్షతో గడిపిన క్షణాలు, ఆకర్ష అందచందాలు మనస్సులో నిండిపోయి జపాన్ని మరిచిపోయాడు. కాసేపటికి వెంటనే తేరుకుని, ఎమిటి ఇలా? ఈ సమయంలో ఈ ఆలోచనలు ఏమిటి? ఇలా జరుగుతోందేమిటి? అని తన్ను తాను తిట్టుకుంటూ ఎంత పాపంచేసాను, ఇది సరియైనది కాదు కదా అని పశ్చాత్తాప్పడుతూ ఆ ఆలోచనలు నిండిన మనస్సుతోనే జపం ఆపేసి మిగతా క్రియ పూర్తిచేశాడు.
జపం అయిన తర్వాత మళ్ళీ దీని గురించి ఆలోచించాడు. ఇన్ని రోజులూ తన జపం ఇంచుమించు ఇలాగే జరిగిందని అతడు గుర్తించాడు. ఇలా జరిగినందుకు చాలా బాధపడి, తను ఇప్పటి వరకు చేసిన సాధనంతా వ్యర్థం అని భావించాడు. వెంటనే మళ్ళీ ఎలా వ్యర్థమౌతుంది? నా జపం నేను విధిగానే నిర్వర్తించానే అని సమధాన పడ్డాడు. ఏమి తేల్చకోని అయోమయ స్థితిలో ఇంకా శ్రద్ధగా జపంచేయాలని నిశ్చయించుకున్నాడు.
మరుసటిరోజు నుండి ఎప్పటి మాదిరిగానే శ్రద్ధగా జపానికి కూర్చోని, జపం ప్రారంభించగానే  కాసేపటికి తన కూతురు మోహా మాటలు వినిపించాయి, వాళ్ళ అమ్మను ఏదో అడుగుతున్నట్లుగా....
మోహకు ఏమి కావాలి? అకర్ష మోహను పట్టించుకోకుండా ఎక్కడ ఉంది? అకర్ష అబ్బ ... నా భార్య ఎంత అందగత్తె. పేరుకు తగ్గట్టే ఆకర్షమైన రూపం. ఈ సారి తనతో ఎటైనా వెళ్ళాలి..... ఆఫీసుకి సెలవు పెట్టాలి. సెలవడిగితే బాస్ ఏమంటాడో? వాడసలే తిక్క మనిషి...... ఇలా కలకలిసిన ఆలోచనలతో చంచల్ జపం సాగుతోంది.
జపం ముగిసే సరికి మళ్ళీ తన అలోచలకి కళ్ళేం పడి  అరే ఎమిటిది? నా మనస్సు గతి తప్పి విహరిస్తొంది? ఎందుకిలా? జపం ఎలా కోనసాగించాలి ఇలాంటి పిచ్చి ఆలోచనలకతో? అని మధన పడుతూ ఉండగా తన గురువు గారు జ్నప్తికి వచ్చారు. అవును గురువు గారిని కలవాలి వారి ఆశీస్సులు, సలహా తీసుకోవాలి. చాలా రోజులైంది గురువు గారిని కలిసి, తప్పక రేపే వేళ్ళి వారి వద్ద నా ఈ అయోమయ పరిస్థితిగూర్చి తెలపాలి అనుకున్నాడు.
ఈ అయోమయ స్థితి సాధనలో పురోగతికి మలుపు. కానీ చాలామంది ఇలాంటి స్థితిలో నిరుత్సాహ పడి ఇంకముందుకు సాగలేమని నీరుగారిపోతారు. ఇలాంటి విషయాలు వారి గురువులతో చర్చించరు. సిగ్గుపడతారు. అనవసరంగా ఇతర స్నేహితులతో పంచుకుంటారు. కానీ ఇలాంటి సాధనకు సంబంధించిన అడ్డంకుల్ని అవరోధాల్ని గురువు గారితో చర్చించి వారి సలహానుగుణంగా సాధనచేస్తే ముందుకు సాగవచ్చు. గురువుల వద్ద ఎటువంటి దాపరికాలు లేకుండా సాధనలో కలిగే ప్రతి అనుభవాల్ని వారితో విచారిస్తే సాధన ప్రగతికి దారిచూపుతారు. లేకుంటే సాధన ముందుకు సాగటం కష్టం.


ఇంకావుంది....................


 

No comments:

Post a Comment